
హైదరాబాద్లో నకిలీ ఔషధాల కలకలం…
హైదరాబాద్లో నకిలీ ఔషధాలు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలో నకిలీ, నాసిరకం ఔషధాల అమ్మకాలను అడ్డుకునేందుకు తెలంగాణ ఔషధ నియంత్రణ (డ్రగ్ కంట్రోల్) శాఖ చర్యలు చేపడుతోంది.
కోఠిలో బాగా పేరున్న రెండు మెడికల్ ఏజెన్సీల్లో నకిలీ ఔషధాల అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులకు విశ్వసనీయ సమాచారం అందడంతో నిఘా పెట్టారు. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఎక్కువమంది వినియోగించే..
ఓ ప్రముఖ కంపెనీ మాత్రలను పోలిన నకిలీలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బుధవారం ఔషధ నియంత్రణాధికారులు ఆ రెండు ఏజెన్సీలలో తనిఖీలు నిర్వహించి.. నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ ఔషధ సంస్థకు సంబంధిత మందులను పంపించారు.
అవి తాము ఉత్పత్తి చేసినవి కావని ఆ సంస్థ స్పష్టంచేయడంతో నకిలీ మందుల విక్రయ నేరం కింద.. ఏజెన్సీ నిర్వాహకులు ఇద్దరినీ అరెస్టు చేశారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.
గతంలో నకిలీ ఔషధాలున్నట్లు గుర్తిస్తే.. ఔషధ నియంత్రణాధికారులు కేసు నమోదు చేసి, మందులను సీజ్ చేసేవారు. అరెస్టు చేసే అధికారం డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఉండేది కాదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘భారతీయ న్యాయ సంహిత’ను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత..
నకిలీ ఔషధాలను ఉత్పత్తి చేసినా, విక్రయించినా.. నిందితులను అరెస్టు చేసే అధికారాన్ని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు కల్పించారు.
ఈ అధికారం కింద తెలంగాణలో తొలిసారిగా ఔషధ నియంత్రణ అధికారులే నకిలీ ఔషధ విక్రయదారులను అరెస్టు చేయడం విశేషం. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఒక్క ప్రముఖ కంపెనీకి చెందిన ఔషధాలకే నకిలీలు తయారుచేశారా? ఇతర కంపెనీలవీ చేశారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ నకిలీ ఔషధాలు ఉత్తరాది నుంచి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.