
బొగ్గు గనులు మూసేసిన ప్రాంతాల్లో అక్కడి ప్రజల జీవనోపాధికి ఏం చర్యలు చేపడుతున్నారు..?
- జస్ట్ ట్రాన్సిషన్ పనితీరును మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలేంటి?
- పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వివరాలు తెలపండి..?
- జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు తీరు, రేషన్ కార్డుల జారీ పురోగతి చెప్పండి..?
- లోక్ సభలో మూడు ప్రశ్నలు అడిగిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి
- లిఖితపూర్వక సమాధానాలిచ్చిన కేంద్ర మంత్రులు
సికె న్యూస్ ప్రతినిధి
ఢిల్లీ: బొగ్గు గనులు మూసేసిన ప్రాంతాల్లో అక్కడ నివసిస్తున్న ప్రజల జీవనోపాధికి ఏం చర్యలు చేపడుతున్నారు..? అని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం.. మూడు ప్రశ్నలు అడిగారు. బొగ్గు గనులకు సంబంధించి జస్ట్ ట్రాన్సిషన్ పనితీరును మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు, మరో రెండు ప్రశ్నల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వివరాలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు తీరు, రేషన్ కార్డుల జారీ వివరాలు కోరారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి, విద్యుత్, కొత్త పునరుత్పాదక ఇంధనం శాఖల సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా లు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.
ఈ ఏడాది జనవరి 31న జారీ చేసిన మైనింగ్ ప్లాన్ మరియు గనుల మూసివేత మార్గదర్శకాల ప్రకారం.. ప్రభావిత కుటుంబాల కోసం పునరావాసం చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికులు, సంఘాలు మరియు పర్యావరణం పై ప్రతికూల ప్రభావాలు తగ్గించే ట్రాన్సిషన్ విధానాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నామన్నారు.
నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి శిక్షణల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. గనుల పర్యాటక ప్రదేశాల వృద్ధి, సౌర ప్రాజెక్టుల స్థాపన, ఖాళీ గనుల్లో చేపల పెంపకం, కోల్ – నీర్ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వివరించారు.
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వివరాలను.. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ తెలుపుతూ… పునరుత్పాదక ఇంధన అమలు సంస్థలు ( ఆర్ఈ ఐఏఎస్ ) జారీ చేసిన టెండర్లకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఎస్ఈసీఐ ), ఎన్టిపిసి తదితర సంస్థలతో కలుపుకుని..ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి 43,922 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్నట్లు చెప్పారు. విద్యుత్ అమ్మకపు ఒప్పందా ( పిఎస్ఏఎస్ )లను కేంద్రం వేగవంతం చేసిందని, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు వెడ్డింగ్ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.
జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరుపై కేంద్ర సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభ ణియా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ..గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం వరకు జనాభా ఆహార అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 81.35 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యంత పేదల కుటుంబాలకు నెలకు 35 కిలోల ఆహార సరుకులు సరఫరా చేస్తున్నామని, డిజిటలైజేషన్, ఆధార్ సీడింగ్, నకిలీల గుర్తింపు, లబ్ధిదారుల మరణాలు, వలసల కారణంగా.. 5.87 కోట్ల రేషన్ కార్డులను తొలగించినట్లు వివరించారు.