
మగువలకు ‘మాధురి’మ.. మమతల అభయగరిమ!
పాలేరు నుంచి మధిర వరకు మంత్రి పొంగులేటి సతీమణి ఆత్మీయ పర్యటన
ఖమ్మం : ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో ఎదిగినప్పుడే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సతీమణి శ్రీమతి పొంగులేటి మాధురి రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు.
ఆత్మీయ పలకరింపు
నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో ఐకేపీ మహిళలు, ఆశా వర్కర్లతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని, ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. అనంతరం ఖమ్మం టీఎన్జీఓస్ భవన్లో మహిళా ఉద్యోగుల సేవలను కొనియాడారు.
శుభకార్యాల్లో ఆశీస్సులు
పర్యటనలో భాగంగా ఆమె పలు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను దీవించారు. పైనంపల్లిలో మారగాని ఉపేందర్ గౌడ్ కుమారుడి వివాహం, ఏదులాపురంలో ఓరుగంటి పిచ్చిరెడ్డి కుమారుడి వివాహం, యర్ర ఉపేందర్ రెడ్డి కుమారుడి రిసెప్షన్, ఖమ్మంలో బండి శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. మోహన్ రెడ్డి గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు. అలాగే ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో బొగ్గుల నరేంద్ర రెడ్డి కుమారుడి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని దీవించారు.
బాధిత కుటుంబాలకు భరోసా
బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామంలో గడ్డం శివనాగిరెడ్డి కుటుంబ సభ్యులను మాధురి రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.
“ఏ కష్టం వచ్చినా మేమున్నామనే నమ్మకంతో ఉండండి.. మంత్రి పొంగులేటి మీకు ఎల్లవేళలా అండగా ఉంటారు” అని భరోసా ఇచ్చారు. పర్యటన పొడవునా మంత్రి సతీమణిని మహిళలు ఆత్మీయంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు.




