
ఏన్కూర్లో బ్యాంకులకు టోకరా
గోల్డ్ అప్రైజర్తో కుమ్మక్కై భారీ మోసం…నలుగురు అరెస్ట్
రూ. 9.53 లక్షల బ్యాంకు రుణం కాజేసిన ముఠా
బ్యాంకు వేలంలో బయటపడిన నకిలీ బంగారం
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 02 2026: కల్లూరు డివిజన్ పరిధిలోని ఏన్కూర్ పోలీస్ స్టేషన్ హద్దుల్లో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఏన్కూర్ శాఖ నిర్వాహకుడు కె.వి. ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా 2024 సంవత్సరంలో బంగారు ఆభరణాల విలువ నిర్ధారించే అధికారి (గోల్డ్ అప్రైజర్) శ్రీపాది సతీష్, శ్రీపాది మౌనిక, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్లు కలిసి సుమారు 242.25 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా చూపించి రూ. 9,53,000 విలువైన రుణాలను పొందినట్లు పోలీసులు గుర్తించారు.
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో సంబంధిత ఖాతాలు నిరర్థక ఆస్తులుగా (NPAs) మారాయి. అనంతరం బ్యాంకు అధికారులు వేలం ప్రక్రియ చేపట్టగా తాకట్టు పెట్టిన ఆభరణాలు నకిలీవని బయటపడింది. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితులైన శ్రీపాది సతీష్, రామచంద్రోజు జయమ్మ, రామచంద్రోజు నరేష్లను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరో నిందితురాలు శ్రీపాది మౌనిక పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఏసీపీ వసుంధర యాదవ్ హెచ్చరించారు. ప్రజలు బ్యాంకింగ్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



