
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్మెన్..
మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు.
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు.. జాగృతి కార్యకర్తల దాడిలో మల్లన్న ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం అయింది.
మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో దాడి జరిగినట్లు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను బయటకు పంపిస్తున్నారు. అయితే.. జాగృతి నేతల దాడి సమయంలో మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు.
కాగా.. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మల్లన్న కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్తో కవితకు ఏం సంబంధం..? మీకు మాకు ఏమైనా కంచం పొత్తా అంటూ మల్లన్న వ్యాఖ్యానించారు.
మేం రిజర్వేషన్లు అమలు చేస్తుంటే.. మీరు పండగచేసుకోవడం ఏంటో అర్థం కావడంలేదంటూ మల్లన్న ప్రసంగించారు. ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న జాగృతి శ్రేణులు.. ఆయన ఆఫీస్పై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ కొనసాగుతోంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
అయితే.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.