
బిల్డర్ వేధింపులతో వ్యక్తి ఆత్మ*హత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో సంచలన నిజాలు బయటకు!
Web desc : బిల్డర్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ*హత్యాయత్నానికి పాల్పడటం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది. కరీంనగర్ కార్ఖానా గడ్డకు చెందిన బీమా రాజ్ కుమార్ తన పట్టా భూమి 500 స్క్వేర్ ఫీట్ భూమిలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో కరీంనగర్ కోతి రాంపూర్కు చెందిన బిల్డర్ జనగామ బిక్షపతి పరిచయమయ్యారు.
ఈ క్రమంలో ఇల్లు నిర్మించి ఇస్తానని అందుకు స్క్వేర్ ఫీట్కు 2060 రూపాయల చొప్పున 10 నెలల్లో ఇల్లు పూర్తి చేసి ఇస్తానని, బ్యాంకు లోను కూడా తానే ఇప్పిస్తానని చెప్పి అగ్రిమెంట్ పై సంతకాలు తీసుకుని నిర్మాణ పనులు మొదలు పెట్టారు.
”బిల్డర్ బిక్షపతి బాధితుల నుంచి ఇప్పటివరకు రూ.24 లక్షలు తీసుకుని ఇల్లు నిర్మాణం పూర్తి చేయక పోగా, అదనంగా మా అంగీకారం లేకుండానే మరో ఫ్లోర్ స్లాబ్ వేసి మా ఇల్లునే కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నాడని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, ఇప్పటికే పలు మార్లు గుర్తు తెలియని వ్యక్తులను తీసుకువచ్చి మమ్మల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని, గతంలో మా ఇంటి తాళాలు పగులగొట్టి తన తాళాలు వేసుకుని మమ్మల్ని బెదిరింపులకు గురిచేశాడని ఈ రోజు కూడా పోలీసుల పేరు చెప్పి నేను కబ్జా చేసుకున్న నా పేరు రాసివ్వండి లేదంటే ఇంటికి పోలీసులు పంపించి మిమ్మల్ని రోడ్డుకు ఈడుస్తానంటు బెదిరించాడని” ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని రాజ్ కుమార్ ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు.
గమనించిన బందువులు హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో బాధితుడి బంధువులు వేధింపులకు గురిచేసిన బిల్డర్ బిక్షపతి పై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
తమకు ఇద్దరు ఆడపిల్లలు తన భర్తకు ఏదైనా జరగరానిది జరిగితే మా కుటుంబం రోడ్డున పడుతుంది అంటూ బాధితుడి భార్య కన్నీరుమున్నీరుగా రోదిస్తుంది. తమకు న్యాయం చేసి తమను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.



