
బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం.. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో మరోసారి తీవ్ర కలకలం రేగింది. ఇక్కడ చదువుకుంటున్న ఒక విద్యార్థిని బుధవారం నాడు హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈ ఘటన క్యాంపస్లోని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కూడా ఇక్కడ కొన్ని ఆత్మహత్యలు, ప్రమాదాలు జరగడంతో.. తాజా ఘటనతో క్యాంపస్లో భయాందోళనలు మళ్లీ మొదలయ్యాయి.
సంగారెడ్డి జిల్లాకు చెందిన అస్మితా బేగంగా గుర్తింపు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని సంగారెడ్డి జిల్లా మానూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన అస్మితా బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది.
బుధవారం రోజున ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నట్లు తోటి స్నేహితులు చెబుతున్నారు. హాస్టల్కు వెళ్తున్నానని చెప్పిన ఆమె.. గర్ల్స్ హాస్టల్-1 బ్లాక్ మొదటి అంతస్తు పైనుంచి అకస్మాత్తుగా కిందకు దూకేసింది.పరిస్థితి విషమం.. హైదరాబాద్ నిమ్స్కు తరలింపు
భవనంపై నుంచి కిందపడటంతో అస్మితా బేగం తలకు, నడుముకు, కాళ్లకు తీవ్రమైన రక్తగాయాలయ్యాయి. కింద పడిపోయి ఉన్న ఆమెను గమనించిన తోటి విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం భైంసా ఆస్పత్రికి, ఆపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆమె అంతర్గత అవయవాలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో మెరుగైన అత్యవసర వైద్యం కోసం కుటుంబ సభ్యులు, అధికారులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అక్కడ ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. యాజమాన్యం వాదనపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఈ తీవ్ర ఉదంతంపై ట్రిపుల్ ఐటీ యాజమాన్యం స్పందించిన తీరుపై విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
ఇది ఆత్మహత్యాయత్నం కాదని, విద్యార్థిని అనుకోకుండా కాలుజారి కింద పడిపోయిందని అధికారులు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, కారణాలను బయటకు రాకుండా అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూతురి పరిస్థితి తెలిసి ఆసుపత్రికి పరుగున వచ్చిన తల్లి, మేనమామలను కూడా అధికారుల సిబ్బంది ఎవరితోనూ మాట్లాడనీయకుండా నిర్బంధించడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల రంగప్రవేశం.. కేసు నమోదు
ఘటన గురించి సమాచారం అందుకున్న భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తన సిబ్బందితో కలిసి వెంటనే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు చేరుకున్నారు. ఘటన జరిగిన గర్ల్స్ హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) గోవర్ధన్ను కలిసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
స్నేహితుల కథనం ప్రకారం ఆమె కిందకు దూకడానికి ముందు ఉరి వేసుకోవడానికి కూడా ప్రయత్నించిందని తెలుస్తోంది. చదువుల ఒత్తిడా లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో బాసర పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.




