
మెగాస్టార్ చిరంజీవి సినిమా చూస్తూ… గుండెపోటుతో మరణించిన ASI
మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన మన శంకర వరప్రసాద్ సినిమా సోమవారం ( జనవరి 12 ) విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.
ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు కుటుంబ ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారు. అయితే, హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలోని అర్జున్ థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు వచ్చిన 50 ఏళ్ల ఆనంద్ కుమార్ అనే వ్యక్తి థియేటర్లోనే అకస్మాత్తుగా తుది శ్వాస విడిచాడు.
చిరంజీవి సినిమాలంటే ప్రత్యేక అభిమానం ఉన్న ఆనంద్ కుమార్, సరదాగా సినిమా చూడాలని థియేటర్కు వచ్చినట్టు సమాచారం. సినిమా మధ్యలో ఆనంద్ కుమార్ అసహజంగా కదలకుండా ఉండటాన్ని పక్కన కూర్చున్న ప్రేక్షకులు గమనించారు.
మొదట సాధారణ అస్వస్థత అనుకున్న వారు, కొద్దిసేపటికి పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రహించి థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు పోలీసులకు, అలాగే 108 అంబులెన్స్ సేవలకు ఫోన్ చేశారు.
అంబులెన్స్ సిబ్బంది థియేటర్కు చేరుకునే సరికి ఆనంద్ కుమార్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
సినిమా చూస్తున్న సమయంలోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్టు ప్రాథమిక వైద్య నిర్ధారణలో వెల్లడైంది. ఈ సంఘటనతో థియేటర్లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఆనందంగా సినిమా చూస్తున్న వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఆనంద్ కుమార్ గతంలో ఏఎస్ఐగా పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి అని సమాచారం.
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, అప్పుడప్పుడు సినిమాలు చూసే అలవాటు ఉన్న ఆయన, ఇలా అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
సరదాగా సినిమా చూసి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆయన, విగతజీవిగా తిరిగి రావడం వారి కుటుంబాన్ని కంటతడి పెట్టించింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
పూర్తి వైద్య నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి ఖచ్చితమైన కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విజయోత్సాహం మధ్యలో విషాద ఛాయలు నింపింది.
థియేటర్లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన సినిమా అభిమానులను, సినీ ప్రేమికులను తీవ్రంగా కలచివేసింది. ఆనందం కోసం వెళ్లిన చోటే ప్రాణాలు విడవడం అనేది ఎంతటి విషాదమో అనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.
ఈ ఘటనతో మధ్య వయస్సు దాటిన వారు తమ ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, చిన్న అస్వస్థతను కూడా నిర్లక్ష్యం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనంద్ కుమార్ కుటుంబానికి పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.




