పాము కాటుకు పేద రైతు మృతి
సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
పొలంలో పనిచేస్తున్న పేద రైతునొకరిని రక్తపింజర పాము కాటువేయడం తో వారం రోజుల పాటు ఖమ్మంలో వైద్యచికిత్స అందిస్తున్నప్పటి కి పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచిన ఘటన బుధవారం జరిగింది.
వివరాల్లోకొస్తే సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన పఠాన్ నాగుల్మీరా (45) అనే చిన్నరైతు తనకున్న అర ఎకరం భూమిలో చెరుకును సాగు చేశాడు. ఈ క్రమంలో ఈనెల 13న చెరుకు తోటలో ఉన్న చెత్తను తగలబెట్టే క్రమంలో రక్తపింజర కాటేసింది. వెంటనే అతడ్ని గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుకొచ్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం సత్తుపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు, పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ఖమ్మం తరలించారు. ఖమ్మంలో చికిత్స పొందుతూ నాగుల్మీరా బుధవారం మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు అకాల మరణానికి గురికావడంతో ఆ కుటుంబ జీవన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పేదరైతు కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.