PoliticalTelangana

24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై సవాల్‌ !

24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై సవాల్‌!

24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై సవాల్‌!

కేటీఆర్‌, హరీశ్‌రావుపైనా ఎలక్షన్‌ పిటిషన్లు

అక్రమంగా గెలిచారు.. వారిపై అనర్హత వేటు వేయాలంటూ ప్రత్యర్థుల విజ్ఞప్తి

రిజిస్ట్రీ పరిశీలనలో దాదాపు 30 పిటిషన్లు

ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 24 మందిపై వారి సమీప ప్రత్యర్థులు ఎలక్షన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆ పార్టీ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కూడా ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రెండేసి దాఖలయ్యాయి. దాంతో వాటి సంఖ్య 30కి చేరింది. ఆ ఎమ్మెల్యేల ఎన్నిక అక్రమమని, తమను విజేతలుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. పలు పిటిషన్లు రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా.. ఇప్పటివరకు ఇంకా దేనికీ రిజిస్ట్రీ రెగ్యులర్‌ నెంబర్‌ కేటాయించలేదు.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చిన 45 రోజుల్లో ఎలక్షన్‌ పిటిషన్‌ (ఈపీ) దాఖలు చేయాలి. ఈ గడువు ఇటీవల ముగిసింది. ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం, ఈవీఎంలు, వీవీప్యాట్లలో లోపాలు తదితర కారణాలు పేర్కొంటూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

సిరిసిల్ల నుంచి ఎన్నికైన కేటీఆర్‌పై ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి ఈపీ దాఖలు చేశారు. కేటీఆర్‌ తన కుమారుడు హిమాన్షును డిపెండెంట్‌గా చూపలేదని, అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

హిమాన్షు పేరిట 32 ఎకరాల భూమి ఉందని, దీన్ని కొనేందుకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో కేటీఆర్‌ వెల్లడించలేదన్నారు. ఈ భూమి సేల్‌ డీడ్‌ను సైతం మహేందర్‌రెడ్డి సమర్పించారు.

అమెరికా యూనివర్సిటీలో చదువుతున్న కుమారుడికి కేటీఆరే ఫీజు కడుతున్నా డిపెండెంట్‌గా చూపలేదన్నారు. కేటీఆర్‌ తన కొడుకు ఆస్తులను చూపలేదని మరో పిటిషన్‌ దాఖలైంది.

ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎన్నికపై బీఎస్పీ అభ్యర్థి చక్రధర్‌గౌడ్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (బీఆర్‌ఎ్‌స)పై కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేశ్‌ ఎలక్షన్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

కృష్ణారావు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి తోపుడు బండ్లు పంచారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్‌ కోరారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి (బీఆర్‌ఎస్‌) ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఎలక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌, వీ నవీన్‌యాదవ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ఎన్నికను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి సరిత పిటిషన్‌ వేశారు.

2018 ఎన్నికలకు సంబంధించిన ఈపీలో ఆయన అనర్హతకు గురయ్యారని, సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, ఈ కేసు గురించి వెల్లడించలేదని ఆరోపించారు. ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్‌,

పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అభ్యర్థి కాట శ్రీనివా్‌సగౌడ్‌ పిటిషన్‌ వేశారు. ఆదిలాబాద్‌, కామారెడ్డి, కొత్తగూడెం, షాద్‌నగర్‌, మల్కాజిగిరి ఎమ్మెల్యేలపై సైతం ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎలక్షన్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

ఇంకా పెండింగ్‌లోనే 2018 ఎన్నికల పిటిషన్లు

2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లే ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. నాటి ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం, గద్వాల్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పులు ఇచ్చింది. వీటిపై సదరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకోవడం గమనార్హం..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button