
లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ డీఈవో
లంచం తీసుకుంటూ డీఈవో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుని వద్ద లంచం తీసుకుంటుండగా జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణినితో పాటు కార్యాలయ ఉద్యోగి దిలీప్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..కన్నాయిగూడెం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత సంవత్సరం అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నాడు.
సెలవు తీసుకున్న అనంతరం విధుల్లో చేరిన ఉపాధ్యాయుడు సెలవు దినాలలో వేతనం బిల్లును మంజూరు చేయాలని డీఈఓను కోరడంతో రూ.25వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో డీఈఓతో పాటు కార్యాలయ ఉద్యోగికి రూ.20 వేలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశారు.