
కూకట్పల్లిలో ట్రావెల్స్ బస్సు దగ్ధం… డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ముప్పు
కూకట్పల్లిలో ప్రమాదవశాత్తు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మెట్రో పిల్లర్ నంబరు 734 వద్ద దుర్గా మల్లేశ్వరి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో (ఎన్ఎల్ 02 బీ 9955) మంటలు వచ్చాయి.
గచ్చిబౌలి నుంచి పాలకొల్లు బయల్దేరిన బస్సు కొండాపూర్, మియాపూర్ మీదుగా కేపీహెచ్బీకి వచ్చినప్పుడు బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు.
డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దించి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం.
కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాణి జరగలేదని, బస్సు మెజారిటీ భాగం కాలిపోయిందని అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను సంబంధిత శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.



