
టీచర్ ప్రవర్తనపై సర్పంచ్ ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి
Web desc : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో సోషల్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా పాఠశాలలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపిస్తు గ్రామ సర్పంచ్ బాస శ్రావణ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్,పాలక వర్గం ఈ నెల 6న గురువారం ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… ఉపాధ్యాయుడు గత కొంత కాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల వాతావరణాన్ని కలుషితం చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి ఉపాధ్యాయుడు పాఠశాలలో పనిచేయడం తమకు ఇష్టం లేదని సర్పంచ్, పాలక వర్గం స్పష్టం చేశారు. పాఠశాలలో జరిగిన సంఘటనలపై వెంటనే విచారణ జరిపి, ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ తో పాటు, ఈ లేఖ కాపీని డీఈఓ జగిత్యాలకు కూడా పంపినట్లు లేఖలో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదు పై ఎలాంటి చర్యలు ఆదేశించారని డీఈవో రాము కు ఓ పత్రిక విలేకరి ఫోన్ ద్వారా వివరణ కోరగా, పిర్యాధు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించమని తెలిపారు.




