
ఏళ్ల తరబడి సీసీ రోడ్డు కోసం ఎదురుచూపులు..!
“అగ్రనేతల ఇళ్ల వద్దే అభివృద్ధి పనులా..?”
“ప్రజా పాలనలో దళితవాడలపై చిన్న చూపు.!”
“వర్షం పడితే నీటిమట్టంతో నిండుతున్న పంచాయతీ రోడ్లు.!”
“పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం.!
“ప్రజా పాలనలో ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఎక్కడ..?”
“వెంకటాపురం మండల ప్రతినిధి సి కె న్యూస్ ముల్తాని.”
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ మర్రిగూడెం ప్రాంత ప్రజలకు కనీస రహదారి సౌకర్యం అందని ద్రాక్షగానే మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సీసీ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఇప్పటివరకు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని వాపోతున్నారు..
వర్షాకాలం వచ్చిందంటే ఎస్సీ మర్రిగూడెం ప్రాంతంలోని పంచాయతీ రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.
చిన్నపాటి వర్షానికే రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి నీటిమట్టంతో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బురద, గుంతలు, నిలిచిన మురుగునీటితో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, అత్యవసర పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు…
గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ ఎస్సీ మర్రిగూడెం ప్రాంతానికి మాత్రం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అగ్రనేతలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల ఇళ్ల పరిసరాల్లోనే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందాల్సిన సమయంలో ఒక ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు…
ఎస్సీ మర్రిగూడెం రహదారుల దుస్థితిపై స్థానికులు పలుమార్లు పంచాయతీ అధికారులకు సమాచారం అందించడంతో పాటు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో అధికారుల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయా..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా పాలనతో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రజా ఆదరణ కరువైందా..? అని ప్రశ్నిస్తున్నారు…ఎస్సీ మర్రిగూడెం ప్రాంతంలో తక్షణమే అధికారులు పర్యటించి రహదారి సమస్యను పరిశీలించాలని, సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు…ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం పాలకుల బాధ్యత అని, అభివృద్ధి పనులు రాజకీయ పలుకుబడి ఆధారంగా కాకుండా అవసరాల ప్రాతిపదికన చేపట్టాలని ఎస్సీ మర్రిగూడెం వాసులు కోరుతున్నారు.



