
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పోలీసులు మృతి
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ఇక, ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు. మరో పోలీసులకు గాయాలు కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ అదుపు తప్పి పోలీసులు ప్రయాణిస్తున్ను కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కారులో ముందు కూర్చోవడంతో ఎస్ అశోక్, డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు.
ఇదిలా ఉండగా.. అంతకుముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆపినట్టు క్షతగాత్రులు తెలిపారు. అనంతరం, బయలుదేరిన పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.