
జీహెచ్ఎంసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
జీహెచ్ఎంసీ కార్మికుడు నిర్లక్ష్యంతో చెత్త కవర్లు ఏరుకునే ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన శనివారం నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హిమాయత్ నగర్ లోని గాంధీ కుటీర్ వద్ద కవర్లు కప్పుకుని పడుకున్న చెత్త కవర్లు ఏరుకునే రేఖ(58)ను చెత్త అనుకొని రాంకీ సంస్థ కు చెందిన జేసీబీ వాహనంతో తీసివేయడం తో వృద్ధురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో భయపడిన ఆ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
అనంతరం అక్కడికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు గమనించి 108 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది రేఖను పరీక్షించి మృతి చెందిందని వారు తెలిపారు.
మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామని పేర్కొన్నారు. మృతురాలు కూతురు సోనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ యూ. చంద్రశేఖర్ వెల్లడించారు.