
కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. ఎంపీ స్టిక్కర్ వాహనం ఎవరిది?
Web desc : హైదరాబాద్లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది.
దీంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, రేవ్ పార్టీ నిర్వహించిన అశోక్ నాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రేవ్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా అశోక్ ఉన్నారు.
వివరాల ప్రకారం.. ఆదివారం కొండాపూర్ SV సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయి, డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు.
పార్టీలో పాల్గొన్న వారు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివంనాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి, యువకులతో ఎంజాయ్ చేయిస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్ బీ టీమ్ పట్టుకుంది. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్టు సీఐ సంధ్య తెలిపారు.
వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు కార్లు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
అయితే, వీకెండ్ సందర్భంగా రేవ్ పార్టీని నిర్వహించింది అశోక్ నాయుడు అని పోలీసులు తేల్చారు. రేవ్ పార్టీ సందర్భంగా రెండు కార్లను సీజ్ చేసిన పోలీసులు.. అందులో ఒక ఫార్చ్యూనర్ కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఆ కారులో ఎవరు వచ్చారు?. ఆ ఎంపీ పేరేంటి?. ఆయనే వచ్చారా లేక ఆ కారులో ఆయన బంధువులెవరైనా వచ్చారా? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అశోక్ నాయుడికి రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.