
పాల కోసం ఏడ్చిందని బిడ్డ ఊపిరి తీసిన కసాయి తల్లి…!
Web desc : మాతృత్వానికే మచ్చతెచ్చేలా కన్నబిడ్డ ను ఊపిరాడ కుండా చేసి చంపిందో మహిళ.
ఈ అమానుష ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో గురువారం చోటు చేసుకుంది. సత్యవేడు సరిహద్దు ప్రాంతమైన తమిళనాడుకు చెందిన వెంకటేశ్కు 2018లో నరసరాజు అగ్రహారానికి చెందిన హేమావతితో వివాహం జరిగింది.
వీరికి కుమారుడు రుత్విక్ (5)తో పాటు ఆరు నెలల చిన్నారి జోషిక ఉన్నారు. వెంకటేశ్ సత్యవేడులోని ఇటుకల తయారీ కేంద్రంలో గుమస్తాగా పనిచేస్తూ, ఎన్ఆర్ అగ్రహారంలో నివసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పనికి వెళ్లిన వెంకటేశ్కు కొద్దిసేపటికే హేమావతి ఫోన్చేసి.. పాప చనిపోయిందని చెప్పింది. దీంతో అతను ఇంటికి చేరుకుని కూతురి మృతదేహాన్ని గుండెలకు హత్తుకుని బోరున విలపిస్తుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ మురళి, ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఘటనా స్థలానికి చేరుకుని హేమావతిని అదుపులో తీసుకుని విచారించగా వాస్తవం వెలుగు చూసింది. పాప పాల కోసం ఏడుస్తుంటే ముక్కు, నోరు మూసేసి తానే చంపేసానని హేమవతి నేరం అంగీకరించింది.
వెంకటేశ్ ఫిర్యాదు మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను పనిలో ఉండగా.. ‘నీకు ఒక బ్యాడ్ న్యూస్, నాకొక గుడ్ న్యూస్.. పాపను చంపేశాను’ అని తన భార్య చెప్పిందని వెంకటేశ్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.



