
పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోట్తో బాధితుల ఆందోళన…
దళితుడిపై ఎస్ఐ దాడి…
Web desc : భద్రాద్రి కొత్తగూడెం : దమ్మపేట మండలం దురదపాడుకు చెందిన కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే నెపంతో దమ్మపేట ఎస్సై వాళ్ళను తీవ్రంగా కర్రలతో కొట్టారని బాధితులు దమ్మపేట పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ బాటిల్స్ తో ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట గంట పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దురదపాడు గ్రామ శివారులో మంగళవారం పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దమ్మపేట పోలీసులు దాడులు నిర్వహించి, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం పాఠకులకు విదితమే.
కాగా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వస్తున్న తమను దమ్మపేట ఎస్సై దుర్భాషలాడుతూ… కర్రలతో కాళ్లపై విచక్షణా రహితంగా కొట్టారని భాదితులు హనుమంతరావు, చిన్న మల్లయ్య వాపోయారు .
తనకు హెర్నియా శస్త్ర చికిత్స జరిగిందని చూపించినా వినకుండా తనను కొట్టారని అన్నారు. తనను విచక్షణా రహితంగా కొట్టిన ఎస్సై ను సస్పెండ్ చేసి తనకు న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అనడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దీంతో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పేకాట ఆడిన వారిపై ఆధారాలతోనే కేసు నమోదు చేశామని, ఎవరినీ కొట్టలేదని ఎస్సై చెప్పినా బాధితులు శాంతించకపోవటంతో డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ నాగరాజు రెడ్డి బాధితులతో మాట్లాడి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తే విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.



