
రాఘవాపురంలో విషాదం..
ఆచూకీ కోసం గాలింపు.. బావిలో మృతదేహం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మే జూన్ 07 2026: మండలంలోని రాఘవాపురం గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లంకి రామకృష్ణ (45) పాత బావిలో మృతదేహంగా కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రామకృష్ణ గత 15 సంవత్సరాలుగా పత్తి, మిర్చి వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా వ్యాపార పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తన మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని వెంట తీసుకెళ్లేవారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ఆదివారం తెల్లవారుజాము నుంచి రామకృష్ణ ఇంటి వద్ద కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వ్యాపారానికి వెళ్లి ఉంటే ఫోన్, బైక్ వెంట తీసుకెళ్లేవారని, కానీ అవి రెండూ ఇంటి వద్దే ఉండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఇంటి సమీపంలో ఉన్న పాత బావి వద్ద రామకృష్ణకు చెందిన చెప్పులు కనిపించాయి. దీంతో అనుమానం మరింత బలపడటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బావిలోకి దిగి పరిశీలించగా రామకృష్ణ మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామకృష్ణ మృతితో ఆయన భార్య, పిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్న వ్యాపారి ఆకస్మిక మృతితో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రామకృష్ణ బావిలో పడటానికి గల కారణాలు ఏమిటి, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.




