
“లక్షన్నర లంచం అడిగారు సార్”- ధైర్యంగా సీఎం ముందే వెళ్లగక్కిన క్రీడాకారిణి..!
SOCIAL MEDIA VIRAL : ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వంలో అవినీతి ఏ స్దాయిలో ఉందో బయటపెట్టే ఘటన ఒకటి ఇవాళ బయటపడింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తైక్వాండో క్రీడాకారిణులతో భేటీ అయ్యారు. ఇందులో క్రీడాకారుల సమస్యల్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటున్నారు.
దీంతో ఓ క్రీడాకారిణి ధైర్యంగా లేచి నిలబడి తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం ముందే బయటపెట్టింది. తనకు అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి కోసం లక్షన్నర లంచం అడిగారని చెప్పేసింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ఆ తైక్వాండో క్రీడాకారిణి తన ఆవేదన అంతా వెళ్లగక్కింది.
తాను జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో స్వర్ణం సాధించినప్పటికీ, అంతర్జాతీయ స్ధాయిలో పోటీ పడేందుకు పంపడానికి క్రీడాధికారులు లక్షన్నర రూపాయల లంచం అడిగినట్లు ముఖ్యమంత్రికి తెలిపింది. దీంతో ఆయన అవాక్కయ్యారు. సదరు క్రీడాకారిణిని ఉద్దేశించి.. సరే, కూర్చోండి, ఫర్వాలేదు అంటూ అనునయించే ప్రయత్నం చేశారు.
అంతే కాదు ఆ కార్యక్రమం లైవ్ ను కూడా వెంటనే కట్ చేశారు. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్ హ్యాండిల్ ద్వారా బయటపెట్టింది. ఉత్తరాఖండ్లో ఒక ధైర్యవంతురాలైన యువతి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలోనే నిలబడి బీజేపీ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిందని తెలిపింది.
తాను జాతీయ స్థాయిలో టేక్వాండోలో స్వర్ణ పతకం సాధించినప్పటికీ, 1.5 లక్షల రూపాయల లంచం అడగడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వెళ్లలేకపోయానని ఆమె వెల్లడించినట్లు పేర్కొంది. ఇది విన్న వెంటనే సీఎం ధామి ఆమెతో, “సరే, కూర్చోండి… పర్వాలేదు” అని అన్నారని, తర్వాత, సీఎం, బీజేపీ సోషల్ మీడియా ఖాతాలతో సహా అన్ని ప్రభుత్వ వేదికల నుండి ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ తీసేశారని వెల్లడించింది.
బీజేపీ ప్రభుత్వంలో లంచగొండితనం, నిధుల దుర్వినియోగం యువత కలలను చిదిమేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా ఫిర్యాదులు చేసినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే ఆ అవినీతిని అణచివేయడంలో నిమగ్నమై ఉన్నారని, ఇది సిగ్గుచేటని విమర్సించింది.




