
భార్యను చంపి ఫ్యాన్కు వేలాడదీసి.. ‘మీ అమ్మ ఉరేసుకుంది’ అంటూ పిల్లలను లేపి..
Web desc : మద్యపానానికి బానిసై, కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి.. ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ కిరాతక భర్త ఉదంతం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఏపీలోని పల్నాడు జిల్లా సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన భార్గవి (35)కి, అదే జిల్లాకు చెందిన బాలకృష్ణతో 2014లో వివాహమైంది.
వీరికి ఇద్దరు పిల్లలు (సాన్వీ కార్తిక్-9, ప్రమోద్ శ్రీవాస్-7) ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం బాచుపల్లి రాజీవ్గాంధీనగర్లోని జయదీపికా ఎస్టేట్లో నివాసముంటోంది. ఉద్యోగం మానేసి, మద్యానికి బానిసైన బాలకృష్ణ ప్రతిరోజూ భార్యను వేధించేవాడు. భర్త చిత్రహింసలు భరించలేక భార్గవి ఈ ఏడాది ఏప్రిల్లో పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే, జూన్ 13న బాలకృష్ణ అత్తింటికి వెళ్లి, ఇకపై భార్యను బాగా చూసుకుంటానని నమ్మించి ఆమెను తిరిగి బాచుపల్లికి తీసుకువచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. గత నెల 20వ తేదీ రాత్రి మద్యం తాగి వచ్చిన బాలకృష్ణను భార్గవి నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బాలకృష్ణ భార్గవి గొంతు నులిమి, ఆమె తలను గోడకు, నేలకేసి బలంగా కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందడంతో, ఆ నింద నుంచి తప్పించుకోవడానికి బాలకృష్ణ నాటకమాడాడు. మృతదేహాన్ని చీరతో ఫ్యాన్కు వేలాడదీశాడు. ఆపై నిద్రపోతున్న పిల్లలను లేపి, ‘మీ అమ్మ ఉరేసుకుంది’ అని నమ్మించే ప్రయత్నం చేశాడు.
మొదట దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు (సీఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలో) తమదైన శైలిలో బాలకృష్ణను విచారించగా అసలు నిజం బయటపడింది. తానే భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేసి, గత నెల 22న కోర్టులో హాజరుపరిచారు.




