
కార్యదర్శి సస్పెన్షన్..! తప్పుడు జనన ధ్రువపత్రం..
web desc : కొమురం భీం జిల్లా సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసిన ఘటన కలకలం రేపుతోంది. 2011లో వేరే ప్రాంతంలో జన్మించిన ఓ బాలికకు.. 2007లోనే సిర్పూర్(టి)లో జన్మించినట్లు చూపిస్తూ నకిలీ జనన ధ్రువపత్రం సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ తప్పుడు జనన ధ్రువపత్రాన్ని కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డీఎల్పీఓ నివేదిక ఆధారంగా సిర్పూర్(టి) ఎస్సై సాగర్ విచారణ కొనసాగించారు. విచారణలో జనన ధ్రువపత్రం జారీపై ఆరోపణలు రావడంతో పంచాయతీ కార్యదర్శి తిరుపతిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరి.. తిరుపతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా పంచాయతీ కార్యదర్శి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. తప్పుడు జనన ధ్రువపత్రం జారీ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




