
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృ*తి…! ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే..
ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు.
చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామానికి చెందిన అనిత (33), భర్త శ్రీశైలంతో కలిసి నివసిస్తోంది. తొమ్మిది నెలల గర్భిణీ అయిన ఆమెను కుటుంబ సభ్యులు ఈ నెల 10వ తేదీన ప్రసవం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో 12వ తేదీ తెల్లవారుజామున 5 గంటల సమయంలో అనితకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయని, అనంతరం ఆమె మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
అనిత మృతి విషయం తెలుసుకున్న బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి సరైన వైద్యం అందించకపోవడం, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అనిత ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వైద్యులు, వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొంతసేపు ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సంగారెడ్డి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న బంధువులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.




