
50 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని జంగాల కాలనీ
బురద రోడ్డులో నాట్లు వేసి నిరసన
విద్యుత్ , రోడ్ల కోసం ఎదురుచూపులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 07 2026: మండల కేంద్రంలోని జంగాల కాలనీలో సుమారు 100 కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కాలనీకి వచ్చి విద్యుత్ స్తంభాలు, రోడ్లు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని, ఎన్నికలు ముగిసిన అనంతరం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
కాలనీలో సరైన రహదారి లేకపోవడంతో వర్షాలు కురిసిన సమయంలో రోడ్లు పూర్తిగా బురదమయంగా మారుతున్నాయని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం ఇదే బురద రోడ్లపై నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. మరోవైపు కాలనీలో విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో చీకట్లోనే జీవనం సాగించాల్సి వస్తోందని, పాములు సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు.
వెనుకబడిన జంగాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్లే తమ కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని కార్మిక సంఘం నాయకులు ఇటికాల లెనిన్ ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
కాలనీలో తక్షణమే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు రహదారులను నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను ఆయన కోరారు.
బురద రోడ్డులో నాట్లు వేసి కాలనీ రహదారుల దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కాలనీ వాసులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి జంగాల కాలనీకి విద్యుత్ స్తంభాలు, రహదారులు ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.




