
8 ఏళ్లుగా ఒకే చోట విధులు.. త్వరలో ఎక్సైజ్ సిబ్బంది బదిలీలు : ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్
తెలంగాణ : ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ బదిలీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. గత 8 ఏళ్లుగా బదిలీలు లేకుండా ఉన్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన సోమవారం తెలిపారు.
మరో మూడు రోజుల్లో ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రులలో సమీక్ష జరగనున్నట్లు వెల్లడించారు. మార్చి 20వ తేదీ వరకు బదిలీ ప్రక్రియ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకే ప్రాంతంలో చాలా సంవత్సరాలకు బదిలీలు లేకుండా విధులు నిర్వహించడం సిబ్బందికి ఇబ్బందేనని, అదే విధంగా ఎక్సైజ్ శాఖకు కూడా మంచి పరిణామం కాదని కమిషనర్ తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంతో 2500 మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఎక్సైజ్ శాఖలో చాలా కాలంగా ఉన్న అధికారుల ప్రమోషన్ అంశం కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.




