
కులం పేరుతో దూషించిన అధికారిని సస్పెండ్ చేయాలి
లంబాడీల ఐక్యవేదిక స్టేట్ కో-ఆర్డినేటర్ రమేష్ నాయక్ డిమాండ్
సి కె న్యూస్ ప్రతినిధి హిమాయత్నగర్
కులం పేరుతో దూషించిన పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ఎండీ రమేశ్ రెడ్డిపై విచారణ చేపట్టి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని లంబాడీల ఐక్యవేదిక స్టేట్ కో-ఆర్డినేటర్ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం బషీర్ బాగ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్టీ ఉద్యోగులను కులం పేరుతో దూశించిన రమేశ్ రెడ్డిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి, ఉన్నత భావాలున్న సీనియర్ అధికారిని పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ఎండీగా నియమించాలన్నారు.
కుల దూషణకు పాల్పడ్డ రమేశ్ రెడ్డికి సహకరించిన తులసీధర్ రెడ్డి అక్రమంగా 6 అదనపు ఇన్ఛార్జి పోస్టులను నిర్వహిస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతూ, అందులో రమేశ్ రెడ్డికి అందులో వాటా ఇస్తున్నారని ఆరోపించారు.
ఈయనను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి, ఆస్తులపై విచారణ చేయాలన్నారు. అక్రమంగా ఈఈగా పదోన్నతి పొందిన అగ్రవర్ణ మహిళ, సివిల్ డిప్లొమా అర్హత కలిగిన సుప్రసన్నను రివర్షన్ చేయాలన్నారు. డిగ్రీ అర్హత కలిగిన ఎస్టీ ఉద్యోగులకు ఈఈగా పదోన్నతి కల్పించాలన్నారు.
30 సం.లుగా ఉద్యోగం చేస్తున్నవారిని పక్కన పెట్టి ఆంధ్రా ప్రాంతంలో పనిచేసి అక్కడే రిటైర్ అయి ఆర్.సి.కుమార్ అనే వ్యక్తికి పోలీస్ గృహ నిర్మాణ సంస్థలో జనరల్ మేనేజర్ పోస్టును కట్టబెట్టారని, ఈ పోస్టు పేరును ఫైనాన్షియల్ అడ్వైజర్గా మార్చి ప్రభుత్వ అనుమతి లేకపోయినా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నెలకు రూ.2.5 లక్షల జీతమిస్తూ నియమించారని ఆరోపించారు.
సమస్యను రెండు రోజుల్లోగా పరిష్కరించకపోతే గవర్నర్, డిప్యూటీ సీఎం, చీఫ్ సెక్రటరీ, చీప్ ప్రిన్సిపల్ సెక్రటరీ(హోం శాఖ), డీజీపీ, గిరిజన ఎమ్మెల్యేలకు, కుల సంఘాలకు, ఎస్టీ కమిషన్, న్యూఢిల్లీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, హైదరాబాద్ కు తెలంగాణలో 100కు పైగా ఉన్న గోర్ బంజారా సంఘాలు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.