
ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. అవమానం భారంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
95 వేలు కాలేజ్ ఫీజు, 5 వేలు అటెండెన్స్ ఫీజు కట్టాలంటూ ఒత్తిడి
బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ కోసం తిరిగిన తండ్రి
డబ్బులు లేక, కాలేజీ ఫీజు కట్టలేక అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న ప్రణీత్ అనే విద్యార్థి
నిరసన తెలిపిన బంధువులు, స్నేహితుల మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న ఆ యువకుడి కలలు కల్లలయ్యాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాక.. సొంతంగా ఫీజు కట్టే స్థోమత లేక.. కాలేజీలో ఎదురైన అవమానం భరించలేక ఇంజినీరింగ్ విద్యార్థి బలన్మరణానికి పాల్పడటం రాష్ట్రంలో కలకలం రేపింది
శనివారం రాత్రి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగగా, విద్యార్థి ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమంటూ మృతుడి బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆందోళనకు దిగారు
కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి
జగిత్యాల జిల్లా, గొల్లపల్లికి చెందిన మ్యాదరి రమేశ్ హైదరాబాద్ నగరానికి వలస వచ్చి హయతనగర్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ ప్రైవేట్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు
రమేష్ కొడుకు ప్రణీత్ (21)కు రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరగడంతో చాలా రోజులపాటు విశ్రాంతిలో ఉన్నాడు.
శుక్రవారం కాలేజీకి వెళ్లి తనకు హాల్ టికెట్ ఇవ్వాలని అడ్మినిస్ట్రేటివ్ అధికారి కృష్ణమూర్తి, ఇతర సిబ్బందిని అడగగా 28 శాతమే హాజరు ఉన్నదని. 95 వేలు ఫీజుతో పాటు రూ. 5 వేలు జరిమానా కడితేనే హాల్ టికెట్ ఇస్తామని చెప్పారు
కొడుకు ప్రణీత్ చదువుకోసం కోసం తండ్రి రమేష్ స్వగ్రామానికి వెళ్లి అక్కడ బంగారం తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడానికి ప్రయత్నించాడు
తనకు ప్రమాదం జరగడంతో కాలేజీకి రాలేకపోయానని, అంత డబ్బు కట్టలేనని, దయచేసి తనకు హాల్ టికెట్ ఇవ్వాలని ప్రణీత్ వేడుకున్నాడు. డబ్బు కడితేనే హాల్ టికెట్ ఇస్తామంటూ సిబ్బంది కరాఖండిగా చెప్పడంతో పాటు ఎదురు మాట్లాడుతావా? అంటూ గదిలో 45 నిమిషాల పాటు నిలబెట్టారు
అంతటితో ఆగకుండా తండ్రికి ఫోన్ చేసి ‘శనివారం ఉదయం వరకు కాలేజీకి వచ్చి ఫీజు కట్టాలి.. లేదంటే నీకొడుకు పరీక్షలు రాయడు’ అంటూ బెదిరించారు. ‘సోమవారం వచ్చి కడతాను.. కాలేజీ ఫీజు కోసమే స్వగ్రామానికి వచ్చాను’ అని రమేశ్ వేడుకున్నా శనివారమే రావాలంటూ షరతు విధించారు
తనతో కాలేజీ యాజమాన్యం కఠినంగా వ్యవహరించడం, తన తండ్రిని కూడా అవమానించడంతో ప్రణీత్ తీవ్ర మనస్తాపానికి గురై శనివారం రాత్రి తన సోదరి ఇంటికి వెళ్లి ఓ గదిలోకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
ప్రణీత్ ఆత్మహత్య విషయం తెలిసి స్నేహితులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు మృతదేహాన్ని ఆదివారం రాత్రి ఇహీంపట్నంలోని శ్రీఇందు కాలేజీ ముందు ఆందోళనకు దిగగా ఇబ్రహీంపట్నం పోలీసులు విద్యార్థిలపై లాఠి చార్జ్ చేసారు



