
MLA లకు సీఎం సీరియస్ వార్నింగ్!
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంత మంది తరచూ వివాదాస్పద పనులు చేస్తూండటంతో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు..
అయితే, తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు, మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు..
కాగా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల తీరు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై చేయి చేసుకోవడం, ఆయన అనుచరులు కూడా దాడి చేయడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై అటవీ అధికారులు పీఎస్ లో ఫిర్యాదు చేయడం, మీడియాకు ఎక్కడంతో ఎమ్మెల్యే బుడ్డా సమాధానం కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది.
దోర్నాల -శ్రీశైలం రహదారిపై రాత్రి 11గంటల సమయం లో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. నల్లమల అటవీ ప్రాంతం టైగర్ రిజర్వు కావడంతో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు వరకు వాహనాలు రాకపోకలు నిషేధం.
అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మంత్రి సంధ్యారాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే క్రమంలో ప్రకాశం జిల్లా నెక్కంటి అటవీ బీట్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు.
ఈనేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా చేయి చేసుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డాయ్యాయి. డిప్యూటి రేంజ్ ఆఫీసర్ రామ నాయక్, డ్రైవర్ కరీం, గార్డు గురవయ్య, మరో గార్డ్ పైనా అనుచరులు దాడి చేశారు.
అంతటితో ఆగకుండా అటవీ అధికారుల వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే డ్రైవ్ చేస్తూ నలుగురిని అందులో ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతూ శ్రీశైలంలోని మంత్రి గొట్టిపాటి గెస్ట్ హౌస్ కు తరలించారు. వాకీటాకీలు, సెల్ఫోన్లు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కొన్ని గంటలపాటు నిర్బంధించారు. అక్కడ అందరిని చితకబాదారు.
బాధితులంతా ప్రకాశం జిల్లా అటవీ సిబ్బంది. ఈ వ్యవహారం మార్కాపురం డీఎఫ్ ఓ దృష్టికి తీసుకువెళ్లారు బాధితులు. బాధితులు పీఎస్ లో ఫిర్యాదు కూడా చేసారు. బాధితుల్లో దళితులు ఉండడంతో దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.