
ఎలినినోపై అప్రమత్తం
ఏన్కూరులో మండల స్థాయి సమన్వయ సమావేశం
సర్పంచులు, కార్యదర్శులకు దిశానిర్దేశం
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 22 2026: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏన్కూరు రైతు వేదికలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
పంచాయతీరాజ్, వ్యవసాయ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక, ఉద్యానవన (హార్టికల్చర్), గ్రౌండ్ వాటర్ తదితర శాఖల అధికారులు పాల్గొని వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
సమావేశంలో ప్రధానంగా ఎలినినో ప్రభావం వల్ల ఏర్పడే వర్షాభావ పరిస్థితులు మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా చర్యలు చేపట్టడం, రైతులకు అవగాహన కల్పించడం, నీటి వనరులను సంరక్షించడం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించడం, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
సోక్ పిట్స్ నిర్మాణాన్ని ప్రతి గ్రామంలో లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు దోహదపడేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
జలసిరి కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులు వివరించారు.
అదేవిధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా పనులను గుర్తించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
రేపటి నుంచి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించి, ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సమావేశంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




