
పప్పు కోసం క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి…
పప్పు వాసన చూపించి మరీ పొట్టుపొట్టు కొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..!
క్యాంటీన్ సిబ్బందితో ఓ ఎమ్మెల్యే గొడవకు దిగి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది.
శివసేన శిందే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ గెస్ట్ హౌస్లో క్యాంటీన్ సిబ్బందితో గొడవకు దిగారు. సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా ఓ వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ముఖంపై పిడి గుద్దులు గుద్దతూ తనలోని ఆవేశాన్ని తీర్చుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంత దారుణానికి పాల్పడ్డ ఈ ఎమ్మెల్యే ఎవరు, ఈ కథ ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ముంబయి చర్చ గేట్లోని ప్రభుత్వ ఆకాశవాణి అతిథి గృహంలో ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఉంటున్నారు.
అయితే మంగళవారం రోజు ఆయనకు అక్కడి సిబ్బంది భోజనం వడ్డించారు. ఈక్రమంలోనే తనకు వడ్డించిన పప్పు వాసన వస్తుండగా.. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అక్కడి సిబ్బందిని పిలిచారు. ముఖ్యంగా పప్పు వాసన చూడమని కోరారు.
అయితే అక్కడకు వచ్చిన ఆపరేటన్ అలాంటి వాసనేమీ రావట్లేదని చెప్పగా.. తీవ్ర కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే గొడవకు దిగారు. వాసన రావట్లేదా అంటూనే ఆపరేటర్ మీద చేయి చేసుకున్నారు. పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఆపై ముఖం మీద పిడి గుద్దులు గుద్దారు. దీంతో ఆపరేటర్ కింద పడిపోయాడు.
అయితే ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇదే విషయమై ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ను ప్రశ్నించగా.. తాను చేసింది తప్పేమీ కాదని సమర్థించుకున్నారు. తాను గాంధేయవాదిని కాదంటూ స్పష్టం చేశారు.

ఇదే తన శివసేన శైలి అని.. బాలా సాహెబ్ ఠాక్రే నేర్పిన శైలి అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తనకు జూడో, జిమ్నాస్టిక్స్, కరాటే, రెజ్లింగ్ వంటి మార్షల్ ఆర్ట్స్లో నేపథ్యం ఉందని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ సంఘటనను అసెంబ్లీలో కూడా ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు .
ముఖ్యంగా ఎందుకు కొట్టారని అడగ్గా.. చాలా రోజులుగా అక్కడ నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని చెప్పారు. దీనిపై అనేక సార్లు ఫిర్యాదులు చేసిన వారు తీరు మార్చుకోలేదని.. అందుకే తాను ఇలా స్పందించాల్సి వచ్చిందని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ స్పష్టం చేశారు.
అయితే ఈయన తీరుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పది మందికి చెప్పాల్సిన స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి.. బహిరంగంగా సిబ్బందిపై ఇలా దాడికి పాల్పడటం, పైగా తన చర్యను సమర్థించుకోవడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆహార నాణ్యతపై ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయని, ఇలా శారీరక దాడికి పాల్పడటం సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా శివసేన పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.