
డివైడర్ పక్కనే కుక్క మృతదేహం..
48 గంటలు గడిచినా స్పందించని అధికారులు
పురుగులు పడి భరించలేని దుర్వాసన..
ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన పంచాయతీ యంత్రాంగం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 06 2026: ఏన్కూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై డివైడర్కు ఆనుకొని ఓ కుక్క మృతి చెంది 48 గంటలు దాటినా సంబంధిత మండల, గ్రామపంచాయతీ అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిత్యం వందలాది వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై కుక్క మృతదేహం అలాగే పడి ఉండటంతో పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టాయి. భరించలేని దుర్వాసన వెదజల్లుతుండటంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మృత జంతువు నుంచి వెలువడుతున్న దుర్వాసనతో పాటు పురుగులు వ్యాపిస్తుండటం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రహదారి వెంట నివసించే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెబుతున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన గ్రామపంచాయతీ అధికారులు, మండల అధికారులు ఇంత తీవ్రమైన సమస్యపై కూడా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. పరిశుభ్ర గ్రామాల గురించి ప్రచారం చేసే అధికారులు, ప్రజల సమస్యల విషయంలో మాత్రం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మృత కుక్కను తొలగించి, ఆ ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్, క్రిమిసంహారక మందులు చల్లి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
“48 గంటలు గడిచినా స్పందన లేదు… పురుగులు పట్టి దుర్వాసన వెదజల్లుతున్నా అధికారులు నిద్ర మేల్కొనకపోవడం దారుణం” అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




