
సమీకృత ఫార్మ్ పాండ్ పథకం..
రైతులకు వరంగా మారనున్న కొత్త విధానం
ఆదాయం పెంపు నుంచి నీటి భద్రత వరకు అనేక ప్రయోజనాలు..
గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 05 2026:
రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన సమీకృత ఫార్మ్ పాండ్ పథకం రైతులకు కొత్త ఆశలు కల్పిస్తోంది. ఒకే వ్యవసాయ క్షేత్రంలో చెరువు, చేపల పెంపకం, పాల ఉత్పత్తి, కూరగాయల సాగు, పశుగ్రాసం, వర్మీ కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతు ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం ఈ పథకం ద్వారా కలుగనుంది.
ప్రస్తుతం రైతులు ఒకే పంటపై ఆధారపడుతుండగా, వర్షాభావం లేదా మార్కెట్లో ధరలు తగ్గితే నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అయితే ఈ పథకం అమలైతే ఒక రంగంలో నష్టం వచ్చినా మరో రంగం ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉండటంతో రైతుల ఆర్థిక భద్రత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఫార్మ్ పాండ్లో నిల్వ చేసిన నీటిని పంటలకు వినియోగించడం వల్ల సాగునీటి కొరత తగ్గుతుంది. అదే నీటిలో చేపల పెంపకం చేపట్టడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. పాడి పశువుల పెంపకంతో పాలు విక్రయించే అవకాశం ఉండగా, వాటి వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి సేంద్రియ ఎరువుగా వినియోగించడం వల్ల ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది. కూరగాయల సాగు ద్వారా కుటుంబానికి పోషకాహారం అందడంతో పాటు మిగిలిన ఉత్పత్తిని విక్రయించి ఆదాయం పొందవచ్చు.
ఈ పథకం గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రైతు వేదికల్లో అవగాహన సదస్సులు, నమూనా ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పథకం అమలు విధానం, లాభాలు, శాఖల నుంచి లభించే సబ్సిడీలు, సాంకేతిక సహాయంపై వివరిస్తున్నారు.
అలాగే రైతులు అనుసరించాల్సిన విధానాలను క్షేత్రస్థాయిలో వివరించి, ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేసి దశలవారీగా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే రైతుల ఆదాయం పెరగడంతో పాటు నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ ఉపాధి, మహిళా సాధికారతకు కూడా విశేషంగా దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.




