
మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి నోటీసులు.!
WEB DESC : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసు విచారణకు సంబంధించి కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది.
గతంలో కోర్టు ద్వారా జారీ అయిన నోటీసులు కేసీఆర్కు సక్రమంగా చేరలేదని వెల్లడవ్వడంతో.. న్యాయస్థానం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గత విచారణల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్కు పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంపై న్యాయమూర్తి.. ఈసారి ఎలాంటి సాంకేతిక విఘాతాలు లేదా డెలివరీ సమస్యలు తలెత్తకుండా పక్కాగా నోటీసులు అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
నోటీసుల జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతివాదికి సమాచారం అందినట్లు రుజువులను న్యాయస్థానం ముందు ఉంచాన్నారు. పిటిషన్లో పేర్లు ఉన్న ప్రతివాదులందరికీ నోటీసులు సమర్పించాల్సిన బాధ్యతను సంబంధిత యంత్రాంగానికి కోర్టు అప్పగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతా లోపాలు జరిగాయని, అలాగే నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ గతంలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఒక ప్రైవేట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో పిటిషనర్ రాజలింగమూర్తి అనారోగ్యంతో మరణించారు.
దీంతో పిటిషనర్ మృతి చెందడం వల్ల ఈ కేసు విచారణ ఆగిపోతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ఈ అంశం తెలంగాణ హైకోర్టు దృష్టికి వెళ్లగా.. అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో స్పష్టమైన తీర్పునిచ్చింది. ప్రజా ప్రయోజనాలు, ప్రాజెక్టు భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి పిటిషనర్ మరణించినప్పటికీ కేసు విచారణను నిలిపివేయవద్దని, యథావిధిగా భూపాలపల్లి జిల్లా కోర్టులోనే కేసు విచారణను కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.




