
దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ట్రై మోటార్ సైకిళ్ల పంపిణీలో మంత్రి పొంగులేటి
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 19 2026: దివ్యాంగుల సంక్షేమంతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై సమకూర్చిన త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వశక్తితో జీవించేందుకు అవసరమైన సహాయ ఉపకరణాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయడంలో ట్రై మోటార్ సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
దివ్యాంగత్వాన్ని వైకల్యంగా భావించకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని పేర్కొన్నారు. దివ్యాంగులు స్వయం సమృద్ధి సాధించి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, ఇతర సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, దివ్యాంగ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




