
వైరాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
బియ్యం వ్యాపారిపై 6ఏ కేసు నమోదు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 18 2026: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వైరా ప్రాంతంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అష్ణగుర్తి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుబడింది.
అధికారుల వివరాల ప్రకారం.. అష్ణగుర్తి గ్రామానికి చెందిన బియ్యం వ్యాపారి బలగాని నరసింహారావు ఓ పాడుబడిన ఇంట్లో తెల్లటి ప్లాస్టిక్ సంచుల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. మొత్తం 19 సంచుల్లో సుమారు 9.50 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో బియ్యాన్ని సీజ్ చేసి, తదుపరి భద్రతా చర్యల నిమిత్తం సంబంధిత రేషన్ డీలర్కు అప్పగించారు. వ్యాపారి నరసింహారావుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కొణిజర్లలోనూ తనిఖీలు
ఇదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం కొణిజర్ల మండలంలోని పలు రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసింది. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో డీలర్లు నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారా లేదా అనే అంశంపై అధికారులు పరిశీలించారు.
రేషన్ షాపుల్లోని రికార్డులు, నిల్వలు, పంపిణీ విధానాన్ని తనిఖీ చేసి, లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బియ్యం అందుతున్నదీ లేనిదీ పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
అక్రమాలపై నిరంతర నిఘా
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రతిరోజూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వ, తరలింపు, విక్రయాలపై నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.




