
టేకులపల్లి కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ
సికె న్యూస్ ప్రతినిధి ఇల్లందు. టేకులపల్లి మండలంలోని “కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలను” ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, రుచి మరియు మెనూ గురించి విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యాబోధన, పాఠశాల పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య , విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే ప్రధాన పునాది అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే స్థాయికి ఎదగాలని సూచించారు.
విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.




