
సుస్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం?.. పీసీసీ నోటీసులపై కొండా సురేఖ
Web desc : తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించిన కొండా సుశ్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తగత అభిప్రాయం అని పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలపై తనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గురువారం కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి లేఖ రూపంలో వివరణ ఇచ్చారు.
ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలనడం, సుస్మిత వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్దం అని ఈ అంశంలో నా ప్రమేయం లేదని గుర్తించాలని వివరణ లేఖలో పేర్కొన్నారు.
సుస్మిత వ్యాఖ్యలపై తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, కాంగ్రెస్ నాయకత్వంపై నాకు గౌరవం ఉందని పేర్కొన్నారు. తన కూతురు కొండా సుస్మితా పటేల్ ఇటీవల గీసుకొండలో చేసిన రాజకీయ వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అందులో స్పష్టం చేశారు.
కుటుంబ బాంధవ్యం ఉన్నంత మాత్రాన ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన తనకు వివరణ కోరుతూ నోటీసు ఇవ్వడం సముచితం కాదని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని కమిటీని కోరారు.
ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పలుచోట్ల వేడుకలు నిర్వహించారని మంత్రి సురేఖ తెలిపారు. ఇందులో భాగంగా తన స్వస్థలమైన గీసుకొండలో కూడా అభిమానులు నిర్వహించిన వేడుకల్లో తన కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని చెప్పారు
ఆ సభలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, వాటికి తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణా నియమావళి పట్ల తనకు సంపూర్ణ గౌరవం ఉందని, తనకు జారీ చేసిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి ఆమె గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగిందంటే.. పరకాల నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గీసుకొండలో జరిగిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో కొండా సుస్మితా పటేల్ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యేందుకు కొండా మురళీ ఎంతో సహకరించారని, అప్పట్లో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి సీఎం మాట తప్పారని ఆమె ఆరోపించారు.
అలాగే స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అండగా నిలబడితేనే కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉందని, దమ్ముంటే రేవూరి ప్రకాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని ఆమె బహిరంగంగా సవాల్ విసిరారు.
సొంత పార్టీ ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ మంత్రి కూతురు ఇలాంటి బహిరంగ విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామాలను సీరియస్గా తీసుకున్న పీసీసీ అధిష్ఠానం.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో మంత్రి కొండా సురేఖకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.




