
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం చాలా సుదీర్ఘంగా జరిగింది. పలు అంశాలను మంత్రి మండలి కూలంకషంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటి వివరాలను సహచర మంత్రులు, పొన్నం ప్రభాకర్ , వాకిటి శ్రీహరి తో కలిసి మీడియాకి వెల్లడించడం జరిగింది.
9 రోజుల్లోనే రూ. 9000 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని మండల కేంద్రాలు, రైతు వేదికల దగ్గర ఈ విజయోత్సవ సభలు నిర్వహించుకోవాలని నిర్ణయించాము. రాష్ట్ర రాజధానిలో డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర విజయోత్సవ సభ జరుగుతుంది. ఈ సభలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు పాల్గొంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటి వరకు 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
వీటన్నింటిని స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి పరిష్కరించాలని కేబినెట్ నిర్ణయించింది.
గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో నవంబర్ 9 లోగా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయించాము.
ట్రిపుల్ఆర్ లో చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలో మీటర్ల రోడ్డును నిర్మించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
గోదావరి నది లోని 400 టీఎంసీల నీళ్లను పెన్నా బేసిన్ లోకి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అఫెక్స్ కమిటీలో ఆనాటి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 2016 లో బనకచర్లకు AP ప్రభుత్వం ఫౌండేషన్ వేసింది. మసిబూసి మారేడు కాయ చేస్తూ కప్పి పుచ్చుకునేందుకు తమ ప్రభుత్వంపైన ఇప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. జూలై మొదటి వారంలో బనకచర్లపై గత ప్రభుత్వ తప్పిదాలను, వాస్తవాలను వివరించాలని కేబినెట్ లో నిర్ణయించాము. గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకోవద్దని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
విభజన చట్టంలోని అంశాలను అతికొద్ది రోజుల్లో హైలెవెల్ కమిటీలో చర్చించి పరిష్కరించుకోవాలని నిర్ణయించాము.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలుంటే ఈ నెల 30 వ తేదీ లోగా సమర్పించాలని పీసీ ఘోష్ కమిషన్ కోరింది.
ప్రాజెక్ట్ కు సంబంధించి నాడు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారా? లేదా? కేబినెట్ సబ్ కమిటీ ఏం సిఫారస్ లు చేసింది? ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్ట్ ను ఎక్కడ కట్టారు? కేబినెట్ సబ్ కమిటీని ఏ ఉద్దేశంతో వేశారు? సబ్ కమిటీ అప్రూవ్ చేసిన అంశాలనే అమలు చేశారా?
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు కేబినెట్ లో ఆమోదం పొందాయా? వంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న పూర్తి విషయాలను కమిషన్ కు అందజేయాలని మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నాము.
గత పదేళ్లలో క్రీడలకు సంబంధించిన ఎలాంటి పాలసీని రూపొందించకపోవడంతో ఈనాటి కేబినెట్ సమావేశంలో క్రీడల పాలసీకి ఆమోదం తెలిపాము.
ఇక పరిపాలను సంబంధించి సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారం ను కొత్త మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేయడానికి కేబినెట్ అంగీకరించింది. ఇస్నాపూర్ పక్కనున్న కొన్ని గ్రామాలను ఈ మున్సిపాల్టీలో కలపడం జరుగుతుంది.
దేశాభివృద్ధికి అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి కోసం విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించుకొని డిసెంబర్ 9 నుంచి అమలు చేయాలని కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది.
బాసర త్రిపుల్ ఐటీ తరపున మహబూబ్ నగర్ కు ప్రతి విద్యా సంవత్సరానికి 150 చొప్పున ఆరు సంవత్సరాలకు వెయ్యి 80 మందికి అడ్మిషన్ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదించింది.
శాతవాహన యూనివర్సిటీ కింద హుస్నాబాద్ లో 4 ఇంజనీరింగ్ కోర్సులలో 60 సీట్ల చొప్పున 240 అడ్మిషన్లు ఇవ్వాలని, శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ లో ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం లో 60 సీట్ల 120 సీట్ల అడ్మిషన్లకు కేబినెట్ అంగీకరించింది.
రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ప్రముఖ కేన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయ గారిని ప్రభుత్వ సలహాదారునిగా నియమించుకోవడానికి కేబినెట్ ఆమోదించింది. హైదరాబాద్ లోని ఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్ లో ఆధునీకరణ, సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ప్రతి నెల రెండు సార్లు మంత్రి మండలి సమావేశం జరుపుకోవాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించుకోవాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.