
చిన్నారిని చితకబాదిన పీటీ…
web desc : కారేపల్లి : అభం శుభం తెలియని ఓ చిన్నారిపై పాఠశాల పీటీ అమానుషంగా ప్రవర్తించిన ఘటన కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. విద్యార్థులకు ఆటలు నేర్పించి, వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సిన పీటీ ఉపాధ్యాయుడు కఠినంగా వ్యవహరించి రెండో తరగతి విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలిపారు.విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం…కారేపల్లి మండల పరిధిలోని పేరుపల్లి గ్రామానికి చెందిన శరత్ కుమారుడు వెంకట్ శశాంక్, కారేపల్లి పెట్రోల్ బంక్ సమీపంలోని నిర్మల హైస్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు.సోమవారం హెయిర్ కటింగ్ సరిగా చేయించుకోలేదనే కారణంతో పీటీ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన శశాంక్ తీవ్ర నొప్పితో ఏడుస్తూ తన తండ్రికి వీపుపై ఉన్న గాయాలను చూపించాడు.ఎందుకు ఏడుస్తున్నావని తండ్రి ప్రశ్నించగా,హెయిర్ స్టైల్ మార్చాలని,హెయిర్ కటింగ్ సరిగా చేయించుకోవాలని చెప్పి, కటింగ్ చేయించినప్పటికీ అది సరిగా లేదంటూ పీటీ చేతులతో, కర్రతో వీపుపై విచక్షణారహితంగా కొట్టినట్లు బాలుడు తెలిపాడు.
పీటీ దాడిలో విద్యార్థి వీపుపై బొబ్బలు, గాయాలు కావడంతో తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.ఈ ఘటనపై పాఠశాల హెడ్మాస్టర్ను తల్లిదండ్రులు నిలదీయగా,ఘటనపై విచారణ జరిపి సంబంధిత పీటీపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అనంతరం పీటీఎందుకు కొట్టారు?అని ప్రశ్నించగా,నేనే కొట్టా దిక్కున్న చోట చెప్పుకోండి.నేను ఇలాగే కొడతాను అంటూ నిర్లక్ష్యంగా, బెదిరింపు ధోరణిలో సమాధానం ఇచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారిపై జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.




