
బస్సు దగ్ధం… ఒకే కుటుంబంలోని నలుగురి మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
శుక్రవారం తెల్లవారుజామున 3:00 నుండి 3:30 గంటల మధ్య ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బైక్ బస్సు డీజిల్ ట్యాంకును ఢీకొట్టడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి.
మృతుల్లో బైక్పై ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నట్లు సమాచారం. బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికుల్లో కొందరు మంటలను గమనించి, బస్సు ఎమర్జెన్సీ డోర్ పగులగొట్టుకుని సుమారు 12 నుంచి 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కొందరికి గాయాలు అయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నలుగురు నెల్లూరు జిల్లా వాసులు చనిపోయారు. వారిని వింజమూరు మండలం గోల్లవారిపాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది.
వీరంతా హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
ఇక, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్9490 బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి.



