
పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కల సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు భారతీయ పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28,740 ఉద్యోగాలు (అంచనా) భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే, కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేయనుండడం విశేషం.
ఈ నియామకాలలో తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి వాటా దక్కింది. తెలంగాణకు 519 పోస్టులు, ఆంధ్రప్రదేశ్కు 1,215 పోస్టులు కేటాయించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని పోస్టల్ శాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ డాక్ సేవక్తో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎంపిక విధానం పూర్తిగా మెరిట్ ఆధారితంగా ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులనే ఆధారంగా తీసుకుని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండవు.
అందుకే టెన్త్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది అరుదైన అవకాశంగా చెప్పవచ్చు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి విషయానికి వస్తే, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది మరో ప్లస్ పాయింట్గా మారింది. జీతభత్యాల విషయంలోనూ పోస్టల్ శాఖ ఆకర్షణీయమైన వేతనాన్ని అందిస్తోంది.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టుకు నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ABPM / GDS పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు వేతనం చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు ఇది మంచి ఆదాయంగా భావిస్తున్నారు.
దరఖాస్తు ఫీజు విషయంలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఈ నోటిఫికేషన్కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 31, 2026 నుంచి ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి 14, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. మెరిట్ లిస్ట్ను ఫిబ్రవరి 28, 2026న విడుదల చేయనున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు పోస్టల్ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష లేకుండా, టెన్త్ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం కావడంతో, ఈ నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది.




