
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సీపీ సజ్జనార్ నోటీసులు..
ఆధారాలివ్వకుంటే క్రిమినల్ చర్యలు తప్పవు..
హైదరాబాద్ సీపీ సజ్జనార్.. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఇది హాట్టాపిక్గా మారింది. ఆయనపై రిటైర్డ్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు.
వీటిని తీవ్రంగా పరిగణించిన సజ్జనార్ రెండు రోజుల్లో ఆధారాలు సమర్పించాలని లీగల్ నోటీసు పంపించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం విచారించారు. ఈ విచారణను తప్పుపడుతూ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు.

ఈ మీడియా సమావేశంలో సిట్కు నాయకత్వం వహిస్తున్న సజ్జనార్పై ఆరోపణలు చేశారు. ఆయనపై ఏడు కేసులు ఉన్నాయని చెప్పారు. ముందు వాటిపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆయన చేసిన దర్యాప్తుల సగంలో ఎందుకు ఆగిపోతున్నాయో అందరికీ తెలుసని కామెంట్స్ చేశారు. ఇలా తీవ్రమైన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.ప్రవీణ్ కుమార్ చేసిన ఈ ప్రకటనలను సిట్ చీఫ్ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల్లో నిజం లేవని తేల్చి చెప్పారు.
బాధ్యతారాహిత్యంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈ ఆరోపణలు చేశారంటూ లీగల్ నోటీసు పంపించారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా కేవలం సిట్ చీఫ్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
జరుగుతున్న దర్యాప్తుకు ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో ఒక రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
కేవలం మాటలతో సరిపెట్టకుండా చేసిన ఆరోపణలు ఆధారాలు సమర్పించాలని సజ్జనార్ డిమాండ్ చేశారు. దీనికి రెండు రోజులు గడువు విధించారు. ఆరోపణలు చేసినట్టుగా ఆ కేసుల వివరాలు ఇవ్వాలని అన్నారు. ఏడు ప్రశ్నలతో ఈ నోటీసు పంపించారు.
1.ఏడు కేసుల క్రైమ్నెంబర్లు ఏంటీ?
2.ఏయే పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు అయ్యాయి?
3.ఏయే సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు?
4.ప్రతి కేసు నమోదు అయిన తేదీ ఏంటీ?
5.ప్రస్తుతం ఆ కేసులు ఏ దశలో ఉన్నాయి.(విచారణ పెండింగ్లో ఉందా లేదా ఛార్జ్షీట్ దాఖలైందా లేదా కోర్టులో తేలిపోయాయా?)?
6.కోర్టులో విచారణ జరుగుతుంటే ఏ కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి?
7.వీటికి మద్దతుగా మీ వద్ద ఉన్న ఎప్ఐఆర్ కాపీలు, ఛార్జ్షీట్లు లేదా ఏదైనా ఆధారాలు ఉన్నాయా?
రెండు రోజుల్లో వివరాలు అందించడంలో ప్రవీణ్ కుమార్ విఫలమైతే ఆయనపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని నోటీసుల్లో సజ్జనార్ హెచ్చరించారు. కేవలం పరువు నష్టం దావా మాత్రమే కాకుండా క్రిమినల్ ఇంటిమిడేషన్, దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు సంబంధిత సెక్షన్లు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మొత్తం ప్రక్రియ వల్ల కలిగే పరిణామాలకు, ఖర్చులకు ఆయన ఒక్కరే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ లీడర్లు దీనికి కౌంటర్గా ఎమ్మెల్సీ నవీన్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందులో ఆ వ్యక్తి సజ్జనార్ను హెచ్చరిస్తూ నీ కేసులు గుట్టు నా దగ్గర ఉందని హెచ్చరించారు.
ఆ వీడియోను పెట్టి సజ్జనార్ను ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.



