
టాలీవుడ్ లో విషాదం… నటి కన్నుమూత.. కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్..
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి వాసవి (పద్మ) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె, బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు.
నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. పద్మక్కను కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
“వాహిని అక్కా(పద్మక్క).. నిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలం అయిన విజయనగరంలో స్వామిని చేరుకుంది. మొన్న చెప్పేశారు ఇక కష్టం అని, ఊరికి తీసుకువెళ్ళిపోయారు అంట.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సద్గతి ఓం శాంతి.
మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం పద్మక్క. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని కరాటే కళ్యాణి తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. వాహిని మరణ వార్త తెలియడంతో, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.
1978లో విజయనగరంలో జన్మించిన నటి వాహిని.. టీవీ, సినీ రంగాల్లో జయ వాహిని పేరుతో ప్రసిద్ధి చెందారు. చిన్న పాత్రలతో కెరీర్ను ప్రారంభించిన ఆమె.. అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు.
సినిమాలతో పాటుగా సీరియల్స్ తోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో కంటే టీవీ టీవీ సీరియల్స్లోనే ఆమె ప్రయాణం సాఫీగా సాగిందని చెప్పాలి. ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.
గత కొన్నేళ్లుగా రొమ్ము క్యాన్సర్తో పోరాటం చేస్తున్న వాహిని.. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. చివరగా ఆమె ‘బహిర్భూమి’ అనే సినిమాలో కనిపించారు.
ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ నటి కరాటే కళ్యాణి ఓ పోస్ట్ పెట్టడంతో, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాహిని తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, విజయనగరంలో ఆమె ఇంటి పక్కనే ఉండేవారమని కళ్యాణి తెలిపారు.
ఎన్నో పాత్రలు చేసినా, జీవన్మరణ యుద్ధంలో ఉన్న వాహినికి మన సహాయం అత్యవసరమన్నారు కరాటే కళ్యాణి. తెరపై మనల్ని అలరించిన నటి నిజజీవితంలో ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు, అందరం కలిసి చేయూత ఇవ్వాలని ఆర్థిక సాయం చేయమని కోరింది.
దీంతో అనేకమంది తమవంతు సహాయం చేశారు. అయినప్పటికీ వాహిని ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు కళ్యాణి తెలిపారు.




