
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య
web desc : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని సూరారం ప్రాంతానికి చెందిన గోపాల్ (45)కు, మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారానికి చెందిన సురేఖతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. అయితే, గోపాల్ కొద్దికాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్య సురేఖతో రోజూ గొడవ పడేవాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సురేఖ, ఏడాది క్రితం ముగ్గురు పిల్లలను తీసుకుని గోమారంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు గోపాల్ ఎంత ప్రయత్నించినా ఆమె రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి గోపాల్ గోమారానికి వచ్చి, వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గతంలోనూ గోపాల్ బ్లేడుతో ఒంటిపై కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.




