
మంత్రి పదవి ఇస్తారా? లేకుంటే సీఎం సీటు లాక్కోవాలా? రాజగోపాల్ రెడ్డి
Web desc: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలనే సాధించింది. ఈ విజయంతో సంబరాల ఊపులో ఉన్న టైంలోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు మంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే డైరెక్ట్ గా సీఎం కుర్చీనే టార్గెట్ లాక్కుంటానని హెచ్చరించారు. ఇప్పుడే కాదు ఆయన గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చాలా చేశారు. తనను పార్టీలోకి తిరిగి తీసుకున్నప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారని ఇప్పుడు అది కావాలంటూ చాలా కాలం నుంచి పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
అయినా ఆయన్ని ఎవరూ పిలిచి మాట్లాడటం లేదు. ఆయన కామెంట్స్ ఆగటం లేదు. ఇప్పుడు మరోసారి కామెంట్స్తో వార్తలకెక్కారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు.
అయితే ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత అక్కడి నుంచి 2023 ఎన్నికల టైంలో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పదవి హామీతోనే పార్టీలోకి తీసుకొచ్చినట్టు ఆయన చెప్పుకుంటున్నారు.
ఆయన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి ఇవ్వడం సాధ్యం కాదు. అయినా నాకు మంత్రి పదవి కావాల్సిందేనంటూ మొండికేస్తున్నారు.
మంత్రి పదవి ఎలాగైనా సాధించుకోవాలని సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి టార్గెట్ గా బాణాలు సంధిస్తూనే ఉన్నారు. ఆయన మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. ఒకట్రెండు సార్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలిచి మాట్లాడింది.
కానీ వాటిని పట్టించుకోవడం లేదు. అందుకే రోజు రోజుకు ఆయన విమర్శల డోసు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవి అంశాన్ని ప్రస్తావించారు.
పార్టీలోకి తీసుకొని వచ్చినప్పుడు తనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిపదవి ఇవ్వాలని రాజగోపాల్ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే డైరెక్ట్ గా సీఎం అవుతానంటూ హెచ్చరించారు. ఇకపై పదవి కావాలని అడుక్కోవడం ఉండదని నేరుగా సమయం వచ్చినప్పుడు సీఎం సీట్లో కూర్చోవడమే ఉంటుందని హెచ్చరించారు.
కచ్చితంగా తనకు మంచి పదవి వస్తుందని కూడా నమ్మకం వ్యక్తం చేశారు. ఇలా మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజున ఇలాంటి అసంతృప్తి స్వరం వినిపించడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కూడా సీరియస్ గా ఉంటోంది.
పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కూడా ఇలానే రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది కాంగ్రెస్ రూల్స్ కు విరుద్దమని పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చే ప్రయత్నాలు ఉన్నాయని ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఆగస్టులో జరిగిన మంత్రివర్గ విస్తరణ టైంలో కూడా విమర్శలు చేశారు.
ఆస్తులు అమ్మి పార్టీని గెలిపిస్తే తనను మోసం చేశారని మండిపడ్డారు. తనతోపాటు వచ్చిన వారికి మంత్రిపదవులు ఇచ్చారని తనను మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటేనే రాజగోపాల్ రెడ్డికి పడటం లేదు.
ఆయన వేర్వేరు పార్టీల నుంచి వచ్చిన వ్యక్తిని నేరుగా సీఎం సీటులో కూర్చోబెట్టడాన్ని తప్పుపడుతున్నారు. అందుకే సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది రేవంతే అనే భావనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
అధిష్ఠానం వద్ద ఏదో ఒకటి చెప్పి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నారనే ఆలోచనలో ఉన్నారు. అందుకే సందర్భం ఏదైనా సరే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే నీ కుర్చీ లాక్కుంటా అంటూ రేవంత్ రెడ్డికే పరోక్షంగా సవాల్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారుతోంది.
ఓవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు జీవన్ రెడ్డి, ఇంకో వైపు జగ్గారెడ్డి లాంటి వాళ్లతో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి విమర్శలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారతాయని రాష్ట్ర నాయకత్వం ఎన్ని రకాలుగా చెబుతున్నా వీళ్లు మాత్రం తమ పంథం వీడటం లేదు.
సోదరుడు వెంకట్రెడ్డి కేబినెట్లో ఉండగానే రాజగోపాల్ రెడ్డికి పదవి ఎలా లభిస్తుందని పార్టీలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. స్కూల్ పిల్లాడి మాదిరిగా మారం చేస్తున్నారని అంటున్నారు.




