
సరూర్ నగర్ లో భారీ పేలుడు కలకలం…
హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పరిధిలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాబూనగర్లో ఉన్న ఓ నివాస గృహంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
బాబూనగర్కు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో ఈ రోజు హఠాత్తుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. దేవేందేర్ ఇల్లు దాదాపు పూర్తిగా ధ్వంసమై శిథిలావస్థకు చేరింది. ఒక్కసారిగా వచ్చిన పెద్ద శబ్దానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఊపిరి పీల్చుకున్న స్థానికులు.. ప్రమాదం జరిగిన సమయంలో దేవేందర్ కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇల్లు అంతలా ధ్వంసమైనప్పటికీ, అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులెవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్వల్ప గాయాలతో వారు సురక్షితంగా బయటపడటం గమనార్హం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారికి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు సురక్షితంగా ఉన్నాయని, అవి పేలలేదని అధికారులు గుర్తించారు.
ఒకవేళ ఆ మూడు సిలిండర్లు గనుక పిల్లి ఉంటే ప్రమాద తీవ్రత ఊహకందని విధేంగా ఉండేదని, చుట్టుపక్కల ఇళ్లు కూడా ప్రభావితమై భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. సిలిండర్లు పేలకపోవడంతో ఒక పెద్ద ముప్పు తప్పినట్లయింది. ఈ భారీ పేలుడు సంభవించడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.




