
యాసిడ్ సేవించిన ప్రభుత్వ టీచర్ మృతి..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కేవీఆర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కామిని గౌతమి (37) యాసిడ్ సేవించిన ఘటనలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గౌతమి కొంతకాలంగా అనారోగ్యంతో పాటు మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆమెకు పలుచోట్ల వైద్యం అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె భర్త బయటకు వెళ్లిన సమయంలో గౌతమి ఇంట్లో యాసిడ్ సేవించినట్లు తెలుస్తోంది.
ఇంటికి వచ్చిన భర్త ఆమె అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి, వెంటనే నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందారు. మృతురాలి భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.




