
వరంగల్ లో టీచర్ పై సస్పెన్షన్ వేటు..!
Web desc : పాఠశాలకు వెళ్లకుండానే అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యా శాఖ చర్యలు తీసుకున్న ఘటన వరంగల్ పట్టణంలో చోటు చేసుకుంది.
జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ లోని కాశీబుగ్గ పరిధిలో గల లోతుకుంట ప్రాథమిక పాఠశాలలో మనుపాటి రవి సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్నారు.
పాఠశాలకు హాజరు కాకుండా అనేక సార్లు గైర్హాజరు అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో రవి హాజరు కానీ రోజుల్లో సైతం పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసినట్లు సమాచారం.
కవిత అనే మహిళ సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా విద్యా శాఖ అధికారులకు పూర్తి వివరాలతో గతేడాది అక్టోబర్ నెలలో పిర్యాదు చేశారు.
జిల్లా విద్యా శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఏడాది జనవరి 23 న విచారణ రిపోర్ట్ అధికారులకు చేరినట్లు తెలుస్తోంది. పాఠశాలకు గైర్హాజరు అయినప్పటికీ రిజిస్టర్ లో సంతకాలు పలుమార్లు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
హాజరు కాకుండా సంతకాలు చేయడంతో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా జీతాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే జిల్లా విద్యా శాఖ అధికారి రంగయ్య నాయుడు మానుపాటి రవి ని సస్పెండ్ చేస్తూ ఈ నెల 12 న ఉత్తర్వులు జారీ చేశారు.




