
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్…
తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు 144, 163 సెక్షన్లను అమలు చేసి,తొర్రూర్ పట్టణమంతా భారీ బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య తన ఎక్స్ అఫీషియో ఓటును ఇప్పటికే వరంగల్లో వినియోగించుకున్నప్పటికీ, తొర్రూరులో ఎక్స్ఆఫిషియో ఓటును ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసనకు దిగారు.
నిరసన నేపథ్యంలో పోలీసులు దయాకర్ రావును అదుపులోకి తీసుకుని నరసింహారావుపేట పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో నర్సింహులపేట వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు.
పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా, చివరకు దయాకర్ రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.



